రాజయ్యా నిజాయితీకి మా ఏపీలో చోటు లేదయ్యా

0
937
rajayya

ఎమ్మెల్యే అంటే డాబు, ధర్పం, ధర్జా, హోదా, మందీ మార్బలం, నియోజికవర్గానికి సామంతరాజులం అనుకుంటారు.
కార్లు, భంగళాలు అబ్బో, అబ్బో ఎమ్మెల్యే అంటే మాటల్లో చెప్పలేము, ఎమ్మెల్యే అంటే అలానే ఉంటారు అనుకునే ప్రజలు ఒక ఎమ్మెల్యే గురించి చెప్తే ఇలాంటి వారు కూడా ఉంటారా, అబ్బే ఉండరండి, మీరు అబద్దం చెప్తున్నారు అంటారు. మనం ఆధారాలతో చూపిస్తే నిజమేనండోయ్ ఇటువంటి వారు ఉండడం చాల గొప్ప విషయమే నండోయ్ అంటారు.

ఆ ఎమ్మెల్యే పేరు సున్నం రాజయ్య గారు ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లాకి చెందిన సీపిఎం పార్టీ ప్రముఖ రాజకీయ నాయకుడు. 1999, 2004, 2014 లలో ఉమ్మడి ఏపీ భద్రాచలం(ఎస్టీ రిజర్వుడు) శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 2009 లో సి.పి.ఎం పార్టీ తరపున భద్రాచలం స్థానం నుండి పార్లమెంటుకు పోటీ చేసి 6956 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.

రాజయ్య

ఎమ్మెల్యే అంటే సాధారణంగా కారులో వస్తారు కాని ఈయన కారు వాడరు. ఎంత దూరప్రాయణమైనా బస్సు, ఆటో, బైక్ వీటి మీదే ప్రయాణిస్తారు. 2015లో ఒకసారి సామాన్యులు ప్రయాణించే ఆటోలో సచివాలయానికి వెళ్తే పోలీసులు అడ్డుకున్నారు. గేటు బయటే రాజయ్యను అడ్డుకున్న పోలీసులు ఆటోలో వచ్చావ్ నువ్వు శాసన సభ్యుడివంటే మేము నమ్మం అనడంతో తన గుర్తింపు కార్డు చూపించినా నమ్మకుండా కార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఎమ్మెల్యేనే అని నిర్దారించుకున్న తరువాతే పోలీసులు లోనికి అనుమతించారు. మూడు సార్లు ఎమ్మెలేగా గెలిచిన తననని సెక్యూరిటీ అవమానించిందని రాజయ్య గారు మీడియా సమావేశం పెట్టి భాదపడ్డారు.

నియోజకవర్గంలో పర్యటించాలంటే ఆటో లేదా కార్యకర్తల బైక్ లమీదే ప్రయాణిస్తారు. హైదరాబాద్, భద్రాచలం ప్రయాణం బస్సులోనే. ఎమ్మెల్యేగా తనకి వచ్చే జీతాన్ని ఖర్చులు పోను మిగిలినది పార్టీ కార్యక్రమాలకి, ఆర్దిక సాయం కోసం వచ్చేవారికి ధానం చేస్తారు. ఇసుక దోపీడి, కాంట్రాక్టుల్లో వాటాలు, అవినీతి వీటీకి దూరంగా ఉంటారు. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండటంతో పాటు అత్యంత సాదారణ జీవితం గడుపుతారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఖమ్మం జిల్లా పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలు 7 తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. రాజయ్య గారి స్వగ్రామమైన వీఆర్ పురం మండలంలోని సున్నంవారిగూడెం రంపచోడవరం నియోజకవర్గంలో కలిసింది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తులో భాగంగా రంపచోడవరం స్థానం సీపీఎంకు ఇచ్చారు , ఆ పార్టీ తరపున సున్నం రాజయ్య గారు పోటీచేసారు.
ఈ ఎన్నికల్లో నిజాయితీ పరుడు, నిబద్దత కలిగిన వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి అయిన సున్నం రాజయ్య గారికి వచ్చిన ఓట్ల శాతం కేవలం 9.01%. మొత్తం పోలయిన 2,01,807 ఓట్లలో ఆయనకి వచ్చిన ఓట్లు 18182. ఓ రాజయ్యా నిజాయితీకి మా ఏపీలో చోటు లేదయ్యా.

–ప్రసాద్ చిగిలిశెట్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here